హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారీ వర్షాల సమయంలో ట్రాక్ భద్రతకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులకు సూచించారు. అధికారులు, పర్యవేక్షక సిబ్బంది రాత్రి సమయంలో కూడా పరిస్థితి జాగ్రత్తగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో విభాగాధిపతులతో కలసి రుతుపవనాల సన్నద్ధత, రైలు కార్యకలాపాల భద్రత, జోన్ సమయపాలనపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండరాళ్లు, ఇసుక సంచులు, ఆర్ ఎచ్ గిర్డర్ల నిల్వలను సమీక్షించడంతో పాటు అదనంగా 42 బ్లాక్ సెక్షన్లలో మాన్సూన్ పెట్రోలింగ్ను మోహరించినట్లు తెలిపారు. గుర్తించిన 108 ప్రదేశాలలో కాపలాదారులను నియమించామనీ, పెరుగుతున్న నీటి మట్టాలను పర్యవేక్షించడం కోసం రైల్వే ప్రభావిత చెరువులు, ప్రధాన ఆనకట్టలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే ట్రాక్ భద్రతను నిర్ధారించడానికి సున్నిత విభాగాలలోని పరిస్థితులపై రోజు వారీ నివేదికను పంపాలని ఈ సందర్భంగా జైన్ అధికారులను ఆదేశించారు.
కాచిగూడ రైల్వే స్టేషన్లో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభం
ద.మ.రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నంలో మరో ముందడుగు వేసింది.ఇందులో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని, ప్రత్యేక అనుభూతిని అందించడానికి రెస్టారెంట్ ఆన్ వీల్స్ను ప్రారంభించింది.