Monday, April 29, 2024

Drug Rocket – డ్ర‌గ్స్ ముఠా అరెస్ట్ … మెడిక‌ల్ వీసాపై వ‌చ్చి నైజీరియ‌న్స్ దందా..

హైదరాబాద్‌: బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను నేడు జ‌రిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ విభాగం పోలీసులు నెలరోజుల పాటు బెంగళూరులో ఉండి ముఠాను పట్టుకున్నట్టు చెప్పారు. నైజీరియాకు చెందిన మరో డ్రగ్స్‌ పెడ్లర్‌ పరారీలో ఉన్నట్టు చెప్పారు. ఈ కేసులో డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ మ్యాక్స్‌వెల్ ప్రధాన సూత్రధారిగా గుర్తించామన్నారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లు అగ్‌ బో మ్యాక్స్‌వెల్‌, ఇకెం ఆస్టిన్‌ ఒబాక, ఒకే చిగోజిలతో పాటు హైదరాబాద్‌కు చెందిన సాయి ఆకేష్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మ్యాక్స్‌ వెల్‌, చిగోజి నైజీరియన్‌ నుంచి మెడికల్‌ వీసాపై వచ్చారని, మరో నిందితుడు ఆస్టిన్‌ ఒబాక స్టూడెంట్‌ వీసాపై వచ్చాడని వివరించారు.

”ఇప్పటి వరకు ఎన్నో డ్రగ్స్‌ ముఠాలను పట్టుకున్నాం.. కానీ, ఈ గ్యాంగ్‌ చాల తెలివిగా డ్రగ్స్‌ విక్రయాలు జరిపారు. నకిలీ అడ్రస్‌లతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరుపుతున్నారు. దాదాపు ఆరు నెలల్లో రూ.4కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించాం. నిందితులంతా బెంగళూరులో ఉండి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్‌కి చెందిన సంజయ్‌ కుమార్‌, తుమ్మ భాను తేజని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశాం. నిందితుల ఇచ్చిన సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్నాం” అని సీవీ ఆనంద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement