Thursday, May 9, 2024

వచ్చే నెల బతుకమ్మ చీరల పంపిణీ.. సిద్ధమైన కోటి 10 లక్షల చీరలు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా ఇస్తున్న కోటి చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. చీరలను వచ్చే నెల 17 నుంచి అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది పండుగ కోసం 1.10 కోట్ల చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు పంపేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ కసరత్తు ప్రారంభించింది. బతుకమ్మను పండుగను పురస్కరించుకుని చీరల పంపిణీని ప్రతి ఏటా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది చీరల పంపిణీకిగాను రూ.333 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది చీరలను వేగంగా పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా పది లక్షల చొప్పున ఇప్పటివరకు 90 లక్షల చీరలను తయారు చేశారు. మరో నాలుగురోజుల్లో 20 లక్షల చీరలు తయారు చేయనున్నాయి. సిరిసిల్లలోని 16 వేల మంది నేత కార్మికులకు చీరల తయారీ పనులను ప్రభుత్వం అప్పగించింది.

బతుకమ్మ చీరలను ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో రూపొందించారు. చీరలకు డాబీ అంచు ఉండటం ఈసారి ప్రత్యేకత అని అధికారులు చెబుతున్నారు. సిద్ధమైన చీరలను ఈ నెల నాలుగో వారం నుంచి జిల్లాలకు పంపనున్నారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతోంది. అంతకంటే నాలుగు రోజుల ముందే చీరలను పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మాదిరిగానే 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారిగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో రేషన్‌ డీలరు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు, నగరాలు, పట్టణాల్లో రేషన్‌ డీలరు, పురపాలక బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కానున్నాయి. గత సంవత్సరం వరంగల్‌ జిల్లాలోని టెస్కో గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అన్ని గోదాముల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మండలస్థాయి గోదాముల్లోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement