Saturday, May 4, 2024

TS: 22న సెలవు ప్రకటించండి… రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వినతి..

ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. ఈరోజు మధ్యాహ్నం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్దిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు. అనంతరం బండి సంజయ్ చీపురు, పార బట్టి సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి సహా పార్టీ కార్యకర్తలంతా చీపురుపట్టి ఆలయ పరిసరాల్లో మొలిచిన పిచ్చి మొక్కలను ఏరిపారేశారు. చెత్త చెదారాన్ని ఊడ్చేశారు.

ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ…. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాలు శుద్ది చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ది చేయడం సంతోషంగా వుందన్నారు. అయోధ్యలో ఈనెల 22న జరగబోయే అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు.

తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన వుందన్నారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా… ‘‘అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు వుండవు. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని పేర్కొన్నారు.

- Advertisement -

సైకిల్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్..

ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ:ప్రతిష్ట నేపథ్యంలో కరీంనగర్ యువకులు కరీంనగర్ నుండి అయోధ్యకు సైకిల్ పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నగరానికి చెందిన మంగ వంశీ కృష్ణ, ఆదిత్య అనే ఇద్దరు యువకులు ఈరోజు బండి సంజయ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశమున్నందున జాగ్రత్తగా వెళ్లాలని, వీలైనంత మేరకు పగటిపూటే సైకిల్ యాత్ర కొనసాగించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement