Tuesday, April 30, 2024

Big story : సీఎస్‌ఈ సీటు భలే రేటు! 8 లక్షలు నుంచి 15 లక్షలు పలుకుతున్న ఇంజనీరింగ్ సీీటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నగర శివారులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌) సీటు కోసం ఓ ముగ్గురు విద్యార్థులు ఇటీవల సంప్రదిస్తే ఒక్కోక్కరికి రూ.12 లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొన్నాయి. కొన్ని కాలేజీల్లోనైతే రూ.12 లక్షలకు పైనే సీఎస్‌ఈ సీటు పలుకుతోంది. ఆ కోర్సకు ఉన్న డిమాండ్‌తోనే ఈమేరకు ప్రైవేట్‌ కాలేజీలు వసూలు చేస్తుంటే… ఆ కోర్సు చదివితే తొందరగా మంచి ఉద్యోగం పొందొచ్చనే అభిప్రాయంతో చాలా మంది ఆ కోర్సునే ఎంచుకుంటున్నారు. దాంతో మేనేజ్‌మెంట్‌ కోటా (బీ-కేటగిరీ)లో సీఎస్‌ఈ సీట్లకు భలే రేటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈనెల 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. స్లాట్‌బుకింగ్‌, ఫీజు చెల్లింపు కూడా అదే రోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 6వ తేదీన చేపట్టనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 28న, తుదివిడత కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 11న నిర్వహించనున్నారు. ఇంకా మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమే కాలేదు అప్పుడే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ముందస్తుగా కొన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు అమ్మేసుకుంటున్నట్లు సమాచారం. సీటు పొందాలనుకునే వారి నుంచి ఎంతో కొంత మొత్తాన్ని కట్టేసుకొని సీట్లను బుకింగ్‌ కూడా చేసుకుంటున్నారు.

కంప్యూటర్‌ సైన్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల వీక్‌నెస్‌ని ఆసరాగా చేసుకుని నిబంధనలను పాతరేసి సీట్లను రూ.లక్షలకు అమ్మేసుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉండే 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను అమ్ముకునే పనిలో పడ్డాయి. సాధారణంగా ఉన్నత విద్యా మండలి ఈ సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ఇవ్వవలసి ఉంటుంది. ఆతర్వాతే ఆయా కాలేజీలు సీట్లను భర్తీ చేయాలి. కానీ ఈ నోటిఫికేషన్‌ వెలువడకముందే తమ పని చక్కదిద్దుకుంటున్నాయి. సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, సైబర్‌ సెక్యూరిటీస్‌, డేటాసైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌ వంటి కోర్సులకు విద్యార్థుల్లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ కోర్సుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కాలేజీలు సీట్ల విషయంలో ముందే బేరసారాలు చేసుకుంటున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజీలను సంప్రదిస్తే సీట్లు అయిపోయాయని సమాధానాలు వస్తున్నాయని, ఒకవేళ ఉన్నా రూ.లక్షల్లో ఫీజులు చెబుతున్నట్లు సమాచారం. ఫైరవీ ఉంటేనే సీట్లు దొరుకుతున్నాయి.

కాలేజీకో రేటు…

ఇంజనీరింగ్‌కు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ డిమాండ్‌ ఉన్న కాలేజీల్లో, డిమాండ్‌ ఉన్న కోర్సుకు ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీని బట్టి సీటు.. రేటు ఫిక్స్‌ అవుతోంది. రాష్ట్రంలోని పేరుమోసిన కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు భారీ ధర పలుకుతున్నాయి. కాలేజీని బట్టి సీఎస్‌ఈలో ఒక్కో సీటు రూ.6 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ స్లీల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు ఉంటాయి. యాజమాన్య కోటా సీట్లకు కూడా కన్వీనర్‌ కోటా ఫీజునే వసూలు చేయాలి. కానీ దానికి నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ అనంతరం నోటిఫికేషన్‌ విడుదల చేసి జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ మెరిట్‌ ఆధారంగా కేటాయించాల్సిన బీ-కేటగిరీ సీట్లను మార్కెట్‌లో లేని పోటీని ఉన్నట్లు సృష్టించి సీట్లకు రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్‌ కాలేజీలు మాజమాన్య కోటా సీట్ల దందాపై టీఏఎఫ్‌ఆర్‌సీ గతేడాది స్పందిస్తూ ప్రైవేట్‌ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని, ఏ విద్యార్థి అడిగినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కానీ కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు మాత్రం తమకు అవేమి పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయి…

- Advertisement -

2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీ-కేటగిరీ 30 శాతం సీట్లకు అర్హులైన వారితో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించాలి. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మూడు దినపత్రికల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రతిరోజూ కాలేజీలోని నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బ్రాంచ్‌ వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించాలి. కానీ ఈ నిబంధనలు ప్రైవేట్‌ యాజమాన్యాలు పాటించడంలేదని ఆరోపణలున్నాయి. మెరిట్‌ విద్యార్థులకు కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే అన్నట్లుగా కొన్ని కాలేజీలు వ్యవహరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement