Monday, May 6, 2024

KTR: గాంధీజీ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ పరిపాలన… కేటీఆర్

మహాత్మా గాంధీజీ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారుల వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. గాంధీజీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలో ఎవరూ చెప్పని విధంగా సఫాయి అన్న నీకు సలా అని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు.

గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్‌ కార్టింగ్‌ వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. వీటికో రూ.కోటికిపైగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి వాహనాన్ని జలమండలి తనిఖీ చేస్తుందన్నారు. శాంతియుత పోరాటం చేసి కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని ఢిల్లీలో కొందరు నినాదాలు ఇస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప.. ఆచరించరని విమర్శించారు. గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంతకుముందు వేదికపై గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, భేతి సుభాష్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గోపీనాథ్‌, మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement