Tuesday, May 7, 2024

BJP Voice – విద్యుత్ కోత‌లు, ఎరువుల కొర‌త లేకుండా చేసింది మోడీనే – కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – కేంద్రంలో మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని, ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి.. హైద‌రాబాద్ నాంప‌ల్లి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ, రామగుండం NTPCకి మోడీనే శంఖుస్థాపన చేశార‌ని,ఆయ‌న దానిని ప్రారంభం చేశారని కేంద్రమంత్రి అన్నారు. ఎరువుల సమస్యను తీర్చింది మోడీనేనని.. కొరత, కోతలు లేని నూతన భారతావనిని మోడీ ఆవిష్కరించారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎరువుల మీద 2 లక్షల సబ్సిడీ కేంద్రం ఇస్తుందని తెలిపారు. ఎరువుల పరిశ్రమ, NTPC ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు.

కొడుకు సీఎం, అయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజల పై లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు చితశుద్ది లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ కాదు… దాన్ని మెంటైన్ చేయలేమని అంటున్నారని తెలిపారు. ఇంజనీర్లను పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్ గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను కేసీఆర్ ముంచుతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి అంటే నదుల అనుసంధానం జరగాలని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు.

రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారని.. రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని.. కేంద్రం చిత్తశుద్దితో సహకారం చేస్తుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement