Saturday, May 4, 2024

HYD: బీజేపీవ‌న్నీ డ్రామాలే… మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీవన్నీ డ్రామాలేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అని వివరించారు. స్వయం పాలనలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో పేదలకు నిర్మించిన ఇండ్ల కార్యక్రమంలో లబ్దిదారుడి వాటా, బ్యాంక్ రుణం, కొంత ప్రభుత్వ సహాయం ఉండేదని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం లేకుండా ఉచితంగా నిర్మించి ఇస్తుందని వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలోనే మొట్టమొదటగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే నగరంలోని సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాలలో ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొల్లూరు లో 6,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని ఇటీవలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ఇండ్లను కూడా అర్హులైన లబ్దిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటించారని చెప్పారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర బీజేపీ అద్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని, ఏం ఆశించి ఎందుకోసం ఈ రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.

ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేకపోతున్న పేదలకు అర్హులైన ఒకొక్కరికి రూ. 3 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించే విధంగా గృహలక్ష్మి అనే నూతన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించున్నట్లు వివరించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది అర్హులకు ఈ ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇక నైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement