Sunday, April 28, 2024

ఈ-పంచాయతీ భవనంతో మెరుగైన సేవలు.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, మే 17 (ప్రభ న్యూస్‌) : ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే నూతన ఈ-పంచాయతీ భవనం నిర్మించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రేగడి మద్దికుంట గ్రామంలో ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రూ. 10 లక్షల నిధులతో నిర్మించిన నూతన ఈ-పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అధునాతన సౌకర్యాలతో ఈ పంచాయతీ భవనాలకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే నేడు మద్దికుంట గ్రామంలో పంచాయతీ భవనం ప్రారంభించామన్నారు. అలాగే గ్రామంలో ప్రజల అవసరాల నిమిత్తం సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతూ పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి పరుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఇందుకోసం నిధులను కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మలుచుకునేందుకు నిధులను మంజూరు చేస్తున్నారన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల వేషాలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంను దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రికి అండగా నిలిచి మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టేలా ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల ఆనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మెన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌, రైతు సమితి మండల కో ఆర్డినేటర్‌ బోయిని రాజ మల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి సందీప్‌ రావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మెన్‌ అన్నేడి మహిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ అన్నేడి వర్షిణి వెంకట్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రాజకొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జ సతీష్‌, సీనియర్‌ నాయకులు బోయిని శ్రీనివాస్‌, రాజిరెడ్డి, నల్లగొండ స్వామి, నాగరాజు, నోముల శ్రీనివాస్‌ రెడ్డి, తడిగొప్పుల శ్రీనివాస్‌, తాండ్ర మల్లేష్‌, నోముల మల్లారెడ్డి, బుర్ర రమేష్‌, ఉపసర్పంచ్‌ ఆవుల వెంకటేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement