Wednesday, May 1, 2024

TS: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి.. కేసీఆర్

చట్టసభల్లో 33శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… బీసీ (ఓబీసీ) బిల్లు., మహిళా బిల్లు., ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సిఎం కేసీఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు.


బీసీ బిల్లు పై చర్చ – ప్రధానికి బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ లేఖ :
తమ తమ వృత్తులను తర తరాలుగా నిర్వరిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన సబ్బండ వృత్తి కులాలైన బీసీ ల కు చట్ట సభల్లో సముచిత ప్రాధాన్యత దిశగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం సుధీర్ఘంగా చర్చించింది. ఉత్పత్తిలో భాగస్వాములౌతూ, సభ్య సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న బీసీ (ఓబీసీ) కులాలను సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో మరింత దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వున్నదని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీ ల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది.

ముఖ్యంగా.. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ.. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement