Sunday, April 28, 2024

Assembly – ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం – మంత్రి దుద్దిళ్ల ..

హైద‌రాబాద్ – ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో వెల్లడించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే బడ్జెట్‌లో దీనిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

”రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్‌ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడదాం” అని హితవు పలికారు.

బస్సులు పెంచాలి: సునీతా లక్ష్మారెడ్డి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని భారాస స్వాగతిస్తోందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. బస్సు ట్రిప్పులు తగ్గించడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్సులు పెంచి.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement