Tuesday, May 7, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్ పై మ‌రోకేసు

నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్..ఆయ‌న మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్‌ గంజ్‌ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. తన కొడుకుని పరిచయం చేస్తూ.. ఇతర వర్గాలపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో రాజాసింగ్‌పై ఐపీసీ153-ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును రాజాసింగ్‌ తప్పుబట్టారు. శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం గురించి, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. తనపై కొట్టేసిన పీడీ యాక్ట్‌ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement