Sunday, April 28, 2024

TS : ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు… కలెక్టర్ రాజార్షి షా…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్ : మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, ప్రవర్తన నియమావలి ఉల్లంఘించే వారిపై, సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ అలీ అన్నారు. ఆదివారం లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల గురించి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అదిలాబాద్ లోక్ సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మొత్తం 2198 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్ల జాబితా సవరణ అనంతరం 16 లక్షల 44 వేల 715 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.95 లక్షలు దాటవద్దని, ఓటర్లను డబ్బులు మద్యంతో ప్రలోభాలకు గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని , ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో 50 వేలకు నుంచి రవాణా చేస్తూ పట్టుబడితే సీజ్ చేస్తామని, బ్యాంకు ఆధారాలతో సహా వివరాలు చూపిస్తే డబ్బులు తిరిగి వాపస్ ఇప్పిస్తామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా రవాణా చేస్తున్న కోటి 67 లక్షల డబ్బులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తే ముందస్తుగా పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఆరు చెక్ పోస్టులు.. ఎస్పీ గౌస్ అలం
పొరుగు మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ డబ్బు, మద్యం నియంత్రణపై నిఘా పెంచామని, ప్రత్యేకంగా ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే జిల్లాకు సిఆర్పిఎఫ్ బలగాలు వస్తున్నాయని, ప్రజల్లో ఓటు హక్కు సద్వినియోగంపై విశ్వాసం పాదుకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ భద్రత పెంచుతున్నట్టు ఎస్పీ వివరించారు. మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మీడియా సెంటర్ అధికారిని బి . తిరుమల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement