Thursday, April 25, 2024

పల్లె ప్రగతి పనులపై అలసత్వం వద్దు..

క్యాతనపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం తగదని గ్రామపంచాయితీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతిని ప్రారంభించిందని, దీనిపై కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని జెడ్‌పీసీఈఓ నరేందర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో పల్లె ప్రగతి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, పనులను సక్రమంగా నిర్వహించి 31వ తేది మార్చి లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూన్‌ నాటికి నర్సరీలో పెంచుతున్న మొక్కలు సిద్ధంగా ఉండేలా చూడాలని, హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. అనంతరం వార్షిక తనిఖీలో భాగంగా మండలి పరిషత్‌ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. క్యాష్‌ బుక్‌, మండల పరషత్‌కు మంజూరైన నిధుల వివరాలన్నింటిని పరిశీలించారు. సీఈఓ వెంట ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీఓ విజయప్రసాద్‌, ఏపీఓ భాస్కర్‌రావు, జెడ్‌పి సూపరింటెండెంట్‌ బాలకిషన్‌రావు, జెడ్‌పీ సిబ్బంది వేణుగోపాల్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement