Sunday, April 28, 2024

TS : మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో ఏసీబీ సోదాలు

మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని ఆమె ఇంటితోపాటు సూర్యాపేటలో నివాసముంటున్న తస్లీమా భర్త ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -

గత నెల 22న లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీశ్‌ తన 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్‌ కోసం మార్చి నెల మొదటి వారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు కార్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆలేటి వెంకటేశ్‌ను కలువగా.. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.200 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని వెంకటేశ్‌ చెప్పాడు.

దీంతో హరీశ్‌ మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిశాడు. మొత్తం రూ.19,200 ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పింది. వెంటనే ఆయన వరంగల్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందంలో భాగంగా హరీశ్‌ గత నెల 22న కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాకు డబ్బులు ఇవ్వబోయాడు. ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్‌ రూ.19,200ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్‌ వద్ద రూ.19,200లతోపాటు అదనంగా 1.72 లక్షలు లభించాయి. కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. తస్లీమాతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు.

అవినీతి మార్గం.. సేవ పేరుతో ప్రచారం
అవినీతిని మార్గంగా ఎంచుకొని సేవ పేరుతో ప్రచారం పొందుతున్న మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ తస్లీమా నస్రిన్‌ నైజం బయటపడింది. తస్లీమాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ములుగు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌గా 12 ఏండ్లు అకడే విధులు నిర్వహించింది. గత ఏడాది బదిలీల్లో భాగంగా మహబూబాబాద్‌కు వచ్చింది. ప్రభుత్వ సెలవులు వస్తే చాలు మహిళలతో కలిసి నాట్లు వేయడం, పత్తి ఏరడం, మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్‌ మీడియాలో విసృ్తత ప్రచారం చేసుకుంటుంది. కార్యాలయానికి వచ్చే సమయంలో ఆటో, బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేస్తూ విసృ్తత ప్రచారం చేస్తుంది. ఈమె ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేయడం, ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం బస్తా, నగదు ఇచ్చి ఫొటోలు దిగడం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం చేస్తుంటుంది. తస్లీమా మరో కోణంలో రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులతో సెల్ఫీలు దిగుతూ బాబాయ్‌, తమ్ముడు అంటూ వరుసలు కలిపేస్తుంది. ఏసీబీ అధికారుల దాడుల్లో తస్లీమా అసలు నైజం బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement