Thursday, May 2, 2024

TS | పిడుగుపాటుతో యువ రైతు మృతి.. ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌

మంగపేట, (ప్రభ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండ‌లంలో పిడుగు పాటుకు ఓ యువ రైతు చ‌నిపోయాడు. మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పరిధిలోని బొమ్మాయిగూడెంకు చెందిన ఈసం పవన్ కళ్యాణ్ (24 ) పిడుగుపాటుతో గురువారం రాత్రి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈసం పవన్ కళ్యాణ్ తల్లిదండ్రలు ఇద్దరూ గతంలో చనిపోవడంతో తన అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. బొమ్మాయిగూడెంలో ఉన్న తమ పొలంలో అన్నదమ్ములు మొక్కజొన్న పంట వేశారు.

మొక్క జొన్న పంటకు కాపలా కోసం గురువారం రాత్రి పవన్ కళ్యాణ్ మొక్కజొన్న చేను వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో పొలం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పిడుగుపడడంతో ఈసం పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్క‌డికి చేరుకుని ఈసం పవన్ కళ్యాణ్ మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు పలువురుని కలిచివేసింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement