Thursday, May 2, 2024

రైతుల మేలు కోసం తెలంగాణ స‌ర్కారుతో క‌లిసి పనిచేస్తా.. కేటీఆర్​తో భేటీలో స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌

తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపున‌కు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌ ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ సాయిల్‌’ పేరుతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దావోస్‌లో ఆయ‌న రెండు రోజులపాటు ప్రపంచస్థాయి కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులోభాగంగా అత్యంత కీలకమైన ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతో సమావేశమైన సద్గురు.. మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్‌తో దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా తాను చేపట్టిన ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం గురించి సద్గురు మాట్లాడారు. రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని, ఇప్పటినుంచి భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు.

ఇందుకోసం లండన్ నుంచి కావేరి వరకు తాను నిర్వహిస్తున్న ‘సేవ్ సాయిల్’ ర్యాలీలో భాగంగా వివిధ ప్రభుత్వాధినేతలు, ప్రముఖ కంపెనీలను కలిసి ఈ కార్యక్రమం ప్రాధాన్యత, అవసరాన్ని వివరిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతున్న‌ద‌ని, త్వరలోనే ఈ సమస్య వ‌ల్ల‌ ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సద్గురు తెలిపారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవ‌స‌రముంద‌న్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాలను స‌ద్గురుకు వివ‌రించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్ర‌య‌త్న‌మైన‌ హరితహారం కార్యక్రమ వివరాల‌ను తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు, మద్దతు కార్యక్రమాలను తీసుకువచ్చి.. వ్యవసాయోత్పత్తుల పెంపున‌కు చేస్తున్న కృషిని వివరించారు.

తెలంగాణలో రైతు వేదికల నిర్మాణం, రైతులను సంఘటిత పరచడం, వ్యవసాయ విస్తరణ అధికారుల‌ నియామకం, వ్యవసాయరంగానికి ఇస్తున్న రైతు బంధు, రైతు బీమాలాంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం వచ్చే అవకాశముంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. సద్గురు చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమమన్న కేటీఆర్, శ్రీ సద్గురును హైదరాబాద్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన కార్యక్రమాలపైన స‌ద్గురు ప్రశంసలు కురిపించారు. తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపున‌కు చేపట్టిన కార్యక్రమాలపైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ప్రజలు కలిసి రాబోయే భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా ఇప్పటినుంచి వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని శ్రీ సద్గురు పిలుపునిచ్చారు. సద్గురు చేపట్టిన అద్భుతమైన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. స‌ద్గురు ఆశీర్వాదం తీసుకున్నారు. మర్యాదపూర్వకంగా ఆయన వాహనం వద్దకు వెళ్లి సాగనంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement