Sunday, April 28, 2024

రాజకీయాల కోసం రాలే.. రైతుల సమస్యలు చెప్పేందుకు వచ్చాం

కేంద్రం రాష్ట్రాల‌ను, రాష్ట్రాల‌కు సంబంధించిన విష‌యాల‌ను రాజ‌కీయ కోణంలో మాత్ర‌మే చూడొద్ద‌ని.. రైతుల దృష్టితో చూడ‌డం అల‌వ‌ర్చుకోవాల‌ని తెలంగాణ మంత్రుల బృందం కోరింది. రెండ్రోజులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌ని క‌లిసేందుకు ట్రై చేస్తున్నా చాన్స్ ఇవ్వ‌డం లేద‌ని మంత్రుల బృందం తెలిపింది.. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 6,952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లితో పాటు ప‌లువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ ఈ రోజుతో పూర్తవుతున్నది. కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన మరో 12, 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు రెడీగా ఉంది. టార్గెట్ పెంచాలని కేంద్రానికి ఇది వరకే విన్నవించడం జరిగింది. ఇవి కాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఖమ్మం, నల్లొండ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా వరి కోతలు జరగవలసి ఉన్నది. వరి కోతలు జనవరి 15 వరకు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. కేంద్రంతో ఇప్పటి వరకు అనేక చేదు అనుభవాలు ఉన్నాయి.. అందుకే లిఖిత పూర్వక హామీ కోరుతున్నాం.. అన్నారు

కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలి. రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ కేశవరావు, లోక్ సభ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర రావు కార్యాలయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుండి భేటీకి అనుమతిస్తూ ఎలాంటి సమాచారం రాలేదు. కేంద్ర మంత్రి భేటీకి సమయం ఇచ్చే వరకు మా బృందం వేచిచూస్తుంది. రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూయించడం ఉత్తమం. అంతేగాని ఇష్టముంటే కలుస్తం.. లేకుంటే లేదు అన్న ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరించడం అభ్యంతరకరం. కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే .. వెంటనే పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలి అన్నారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణలోని 12,600 పై చిలుకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వానాకాలం వరి ధాన్యం టార్గెట్, పెంచాలనేదానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనేదానికి తేడా తెలియదు.. వారికి అవగాహన లేక పొరపడుతున్నారు అని విమ‌ర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ ఎస్‌ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమాలకర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement