Thursday, May 9, 2024

బంగ్లాదేశ్ తో జరుగుతోన్న టీ20వరల్డ్ కప్ మ్యాచ్ లో .. అర్ధసెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

బంగ్లాదేశ్ తో జరుగుతోన్న టీ20వరల్డ్ కప్ మ్యాచ్ లో అర్ధసెంచరీతో అజేయంగా నిలిచాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ నిలకడైన ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్ మెరుపులు, సూర్యకుమార్ యాదవ్ దూకుడుతో టీమిండియా ఈ మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం విశేషం . వరుసగా విఫలమవుతూ వస్తున్న రాహుల్ బంగ్లాదేశ్ బౌలింగ్ పై ఆధిపత్యం ప్రదర్శించాడు. కొన్ని నమ్మశక్యంకాని షాట్లతో అలరించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 50 పరుగులు చేసి షకీబల్ హసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. కోహ్లీ 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (2) అవుటవడంతో బరిలో దిగిన కోహ్లీ… మొదట రాహుల్ కు సహకారం అందించాడు. ఆపై తాను కూడా యధేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో చకచకా 30 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. హార్దిక్ పాండ్యా (5) విఫలం కాగా, దినేశ్ కార్తీక్ (7) రనౌట్ అయ్యాడు. చివర్లో అశ్విన్ 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 13 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో యువ బౌలర్ హసన్ మహ్మూద్ 3, కెప్టెన్ షకీబల్ హసన్ 2 వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement