Friday, April 26, 2024

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో టీఆర్ఎస్ లీడర్ల దందా: విజ‌య‌శాంతి

బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. పేదల‌కు చెందాల్సిన డబుల్​ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్ఎస్​ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని అన్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారని చెప్పారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్​ బెడ్రూం ఇండ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి గ్రామస్తులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా… గుడిసెల్లో ఉండే పేదలను కాదని, అప్పటికే ఇండ్లు ఉన్నవాళ్లకు డబుల్​బెడ్రూం ఇండ్లు కేటాయించారని చెప్పారు. ఇవి దక్కినవాళ్లలో ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు ఎమ్మెల్యే అనుచరులున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని చెప్పారు. దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. విచారణ చేపట్టిన కోర్టు… రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసిందన్నారు. లబ్ధిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు.

లబ్ధిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం… సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిందని చెప్పారు. అలాగే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ, పెద్ద‌పల్లి జిల్లా మంథ‌ని, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయన్నారు. అర్హుల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ల‌బ్దిదారులు హెచ్చ‌రిస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement