దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది. కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. మరింత పకడ్బందీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి 12-14 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకాలు ఇస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇన్నాళ్లూ కదలలేని స్థితిలోను, అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చారు. కాగా ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన అందరికీ మంగళవారం నుంచి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ వయోపరిమితిలోని చిన్నారులకు కార్వ్బివాక్స్ టీకాలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో దేశంలో 2503 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 మే తరువాత రోజువారీ కేసులు ఇంత తక్కువ సంఖ్యలో నమోదవడం ఇదే ప్రథమం. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య అతి తక్కువగా 36,168గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,29,93,494 కేసులు నమోదైనాయి. కాగా గడచిన 24 గంటల్లో కేవలం 27 మరణాలే నమోదయ్యాయి.
27 నుంచి 100 శాతం కెపాసిటీతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్..
కాగా దేశంలో కరోనా ప్రభావ బాగా తగ్గడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఆంక్షలు ఒక్కొక్కటీ సడలిస్తున్నారు. మార్చి 27నుంచి అంతర్జాతీయ విమానాల్లో 100 శాతం ప్రయాణీకులతో నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి సింధియా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..