Thursday, May 2, 2024

TS – ఆయన నోరు విప్పితే …. పంచ్ పటాసే!?

ప్రణీత్ రావు విచారణపై సర్వత్రా ఉత్కంఠ
రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న ఎంక్వైరీ
కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, రికార్డుల ధ్వంసం వెనక కుట్ర కోణం
కూపీ లాగుతున్న ప్రత్యేక అధికారుల బృందం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా మారిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్టు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. విచారణలో ఆయన ఎలాంటి విషయాలు బయటపెడతారోనన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని అంతర్గత భద్రత వ్యవహారాల్లో కీలక అధికారిగా పనిచేసినందున లోగుట్టు అంతా ఆయనకు తెలిసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రణీత్‌రావు నోరు విప్పితే గత పాలకుల బంఢారం బయటపడుతుందని అంతా అనుకుంటున్నారు.

ఫ‌లితాల మ‌రుస‌టి రోజే డేటా ధ్వంసం..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు డిసెంబర్‌ 4న రాత్రి సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆఫ్‌ చేసి డేటాను ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, రికార్డు ధ్వంసం ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే ప్రణీత్ రావుని డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్‌ ప్రణీత్‌కుమార్‌ ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో స్టేట్ మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసుల ఎఫ్ఎస్ఎల్‌ కు పంపించారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయనున్నారు.

విచార‌ణ‌కు ఎఫ్ఎస్ఎల్ టీమ్ ఏర్పాటు

- Advertisement -

గతంలో ప్రణీత్‌రావు వాడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీస్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీస్ బృందాలు రెండు రోజుల పాటు ఎస్ఐబీలో కీలక ఆధారాలు సేకరించాయి. దాదాపు10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్‌ను స్టోర్ చేసినట్టు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్‌రావు తొలగించారు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రణీత్ రావ్ లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.

ఫోన్ ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు..

కాగా, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్ఐబీ)లో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్‌ ట్యాపింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్టయిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావు అప్పట్లో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబరు 4న (అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి రోజు) ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్‌రావుపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రణీత్‌రావు సస్పెన్షన్‌కు ముందు రాజన్న-సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు.

సిరిసిల్ల దాటి వెళ్లొద్ద‌ని ఆదేశాలు..

సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లోనే డీజీపీ రవిగుప్తా అతణ్ని సిరిసిల్ల జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదని ఆదేశించారు. తొలుత ప్రణీత్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసుల బృందం సోమవారమే సిరిసిల్లకు చేరుకున్నా.. అతని జాడ దొరకలేదని సమాచారం. అయితే.. సిరిసిల్లలోని శ్రీనగర్‌కాలనీలో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి ప్రకటించారు. ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట ఠాణాలో అతనిని ప్రాథమికంగా విచారిస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. విపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్‌ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లలో ఏముంది? అనే కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement