Sunday, May 5, 2024

టీ ఆర్ ఎఫ్ తో దేశ భద్రతకి ముప్పు.. నిషేధం విధించిన భారత ప్రభుత్వం

టీ ఆర్ ఎఫ్ తో దేశ భద్రతకి ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ నివేదికని సమర్పించింది.టీఆర్ఎఫ్ మన దేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు అని హోంశాఖ తన నివేదికలో పేర్కొంది.పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న లష్కరే కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

టీఆర్ఎఫ్ తీవ్రవాద సంస్థ 2019లో ఏర్పడింది. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సంస్థ ఆన్‌లైన్‌లో యువకులను రిక్రూట్ చేస్తూ, వారిని ఉగ్రవాద కార్యకలాపాల్లోకి తీసుకువెళుతోంది. టీఆర్ఎఫ్ సరిహద్దు చొరబాట్లు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటుంది. ఈ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో జమ్మూ కశ్మీర్ ప్రజలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని హోంశాఖ తెలిపింది. హోం శాఖ ప్రకారం భద్రతా దళాలు, పౌరులను చంపడానికి ప్లాన్ చేసినందుకు టీఆర్ఎఫ్ సభ్యులు, వారి సహచరులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. భద్రతా బలగాలు, పౌరులపై దాడులకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement