Thursday, May 2, 2024

Telangana: ఫారెస్ట్ రేంజర్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు.. లక్ష రూపాయల డిమాండ్​

భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం మెడికల్ కాలనీలో ఉంటూ చర్లలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్న పోతా బత్తుల ఉపేంద్రను మావోయిస్టుల పేరుతో ఒక వ్యక్తి బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆగస్ట్ 27న‌ ఒక వ్యక్తి 7671081411 గల నెంబర్ నుండి ఫోన్ చేసి ‘‘నేను మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ను మాట్లాడుతున్నాను, మావోయిస్టు పార్టీకి చెందిన అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకుగాను పార్టీ ఫండ్ గా లక్ష రూపాయలు పంపించండి. ఇవ్వకపోతే నిన్ను మీ కుటుంబాన్ని చంపుతాం” అని బెదిరించారు. దీంతో రేంజర్ భయపడి ఫోన్ పే ద్వారా మొదటగా 20,000 రూపాయలు పంపగా, తర్వాత కూడా ఆ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించి దప దపాలుగా 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,000 రూపాయల చొప్పున మొత్తం 29వేల రూపాయలు పంపడం జరిగింది.

సదరు వ్యక్తి సోమవారం రేంజర్ ను భద్రాచలం కరకట్ట వద్దకు రమ్మని చెప్పగా రేంజర్ అక్కడికి వెళ్లారు. కాగా, ఆ వ్యక్తి అక్కడ రేంజర్ ను కలిసి ‘‘మీకు ఫోన్ చేసింది నేనే.. నా పేరు భగత్ వెంకన్న. మావోయిస్టు పార్టీకి చెందిన వాడిని’’ అని పరిచయం చేసుకున్నాడు. ఇంకా లక్ష రూపాయలు ఇవ్వమని లేకపోతే రేంజర్ ను , ఆయన కుటుంబాన్ని చంపుతాను అని బెదిరించాడు. అక్కడే అందుబాటులో ఉన్న రేంజర్ సిబ్బంది, రెంజర్ సదరు వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతను అక్కడి నుండి పారిపోయాడు. రేంజర్ ఉపేంద్ర పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉపేంద్ర పిర్యాదు పై ఇన్​స్పెక్టర్ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement