రోజు రోజుకూ టెక్నాలజీ మారుతోంది. నేరాల తీరులోనూ క్రిమినల్స్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇంతకుముందులా కత్తి పట్టుకుని తిరిగే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా సైబర్ క్రైమ్స్తో చెలరేగిపోతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఫోన్కు మెస్సేజ్ పంపడం ద్వారానో, ఇన్విటేషన్ పంపడం ద్వారానో, లేదా ఫిషింగ్ మెయిల్, పోర్న్ లింక్ వంటివాటితో యూజర్లను అట్రాక్ట్ చేసి.. ఆ లింకులను క్లిక్ చేయించడం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటి టెక్నిక్స్ని వినియోగించి అమాయకులను మోసం చేస్తున్నారు.. ఇట్లాంటి డార్క్ వెబ్ క్రైమ్స్పై తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. సైబర్ అటాక్స్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహిస్తోంది.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ సన్నద్ధమవుతోంది. డార్క్ వెబ్ దర్యాప్తు కోసం పోలీసు సిబ్బందికి అవగాహన, వారిలో సామర్థ్యాన్ని పెంపొందించడంపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. డీప్ అండ్ డార్క్ వెబ్, హ్యాకింగ్, క్రిప్టో కరెన్సీ వాటి ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించి దాడులకు తెగబడుతున్నారు. ఇట్లాంటి నేరస్తులను కనిపెట్టడానికి, వారిని పట్టుకోవడానికి కావాల్సిన డిజిటల్ పరిజ్ఞానం పోలీసుల్లోనూ ఉండాలి. ఎందుకంటే చాలా నేరాలు ఇప్పుడు ఎక్కడో మారుమూల దేశాల నుంచి జరుగుతున్నాయి.
ఈ ఆందోళనకరమైన ధోరణిని ఎదుర్కోవడానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్, కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ తో కలిసి తెలంగాణలోని పోలీసు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. యునైటెడ్ కింగ్డమ్ (UK)కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ మాజీ పోలీసు అధికారి మార్క్ బెంట్లీతో కలిసి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఇతను ఈ రంగంలో గత 40 సంవత్సరాలుగా క్లాసులు ఇస్తున్నారు.
ఇక.. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్పీఏ)లో డార్క్ వెబ్ పరిశోధకుల కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నిన్న (సోమవారం) ప్రారంభమైంది. ఈ కోర్సుకు దేశం నలుమూలల నుండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి పోలీసు అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ వర్క్ షాప్ను ప్రారంభించి, శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు కలిసి పోలీసింగ్లో డిజిటల్ కార్యక్రమాలకు లీడర్గా వ్యవహరిస్తున్నారని, వేలాది మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడంలో తమకు అద్భుతమైన రికార్డు ఉందని చెప్పారు.
ఈ క్రమంలో 15 రకాల సైబర్ మోసాలకు సంబంధించిన ఉదాహరణలను సీపీ ఆనంద్ తెలియజేశారు. ముఖ్యంగా లోన్ యాప్లు గత 10 రోజుల్లో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఈ నేరస్థులను విచారించడం, పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అంతేకాకుండా మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు, Xsilica ఎపేమెంట్ గేట్వే హ్యాకింగ్ కేసును కూడా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. వీటి దర్యాప్తు అంత ఈజీ కాకున్నా.. దీనికి ప్రత్యేక నైపుణ్యం, వనరులు అవసరమని సీపీ తెలిపారు. డార్క్ వెబ్ని ఉపయోగించి క్రిమినల్స్ మాదకద్రవ్యాలను కూడా రవాణా చేస్తున్నట్లు తెలంగాణ పోలీసుల విచారణలో వెలుగుచూసిందన్నారు.
ఈ వర్క్ షాప్ ప్రయోజనాలను పేర్కొంటూ సీపీ ఆనంద్ ఇలా అన్నారు.. “వాస్తవ ప్రపంచం తీరు వేరు. ఇక్కడ నేర్చుకునే అంశాలు వేరు. ఇప్పుడంతా సైబర్ నేరాలతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఇది పోలీసు వ్యవస్థకు సవాల్గా మారుతోంది. దీన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ (OSINT) వంటి టెక్నాలజీ ద్వారా క్రాక్ చేయవచ్చు. అయితే.. ఈ 5 -రోజుల వర్క్ షాప్, మాస్టర్ క్లాస్ సైబర్ ఇన్వెస్టిగేషన్ వంటి సరికొత్త అత్యాధునిక విధానం, పరిశోధన రంగంలో మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నా” అని సీపీ ఆనంద్ చెప్పారు.