Friday, April 26, 2024

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగటివ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షతోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎంకు నెగెటివ్​గా తేలింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించింది. ఆ రెండింటిలోనూ కరోనా లేదని నిర్ధారణ అయింది. అలాగే, రక్త పరీక్షల్లోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది. ముఖ్యమంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, కాబట్టి ఇక నుంచి విధులకు హాజరు కావొచ్చని వైద్యులు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ రానున్న సీఎం కేసీఆర్… వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడిపై అధికారులు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

గత నెల 19న ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆ రోజు నుంచి సీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్​లో ఉన్నారు. మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఏప్రిల్​ 28న కేసీఆర్​కు ర్యాపిడ్ యాంటీజెన్​తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. యాంటీజెన్​ టెస్టులో నెగెటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్​లో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది. తాజాగా కేసీఆర్ వక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలో వైద్యబృందం మంగళవారం మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ యాంటీజెన్​తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా… రెండింటిలోనూ నెగిటివ్​గా నిర్ధరణ అయింది. సీఎం రక్తపరీక్షల నివేదికలు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement