Thursday, May 2, 2024

ఆస్ట్రేలియా వేదికగా ప్రేక్షకులను అలరించనున్న టీ20 ప్రపంచకప్- నేడు మెగాటోర్నీ

ఏడాది కాకముందే రెండోసారి ప్రేక్షకులను అలరించేందుకు టీ20 ప్రపంచకప్ సిద్ధమయింది. క్రికెట్‌ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల హోరులో ముంచెత్తేందుకు మెగావార్‌ వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం మెగాటోర్నీకి తెరలేవనుంది.. తొలుత క్వాలిఫయింగ్‌ రౌండ్‌ జరుగనుంది. నేరుగా వరల్డ్‌కప్‌ కు అర్హత సాధించని ఎనిమిది జట్లు రెండు గ్రూప్‌లుగా తలపడనున్నాయి. ఇందులో సత్తాచాటిన నాలుగు జట్లు.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న సూపర్‌-12 స్థాయికి అర్హత సాధిస్తాయి. తొలి రోజు పోటీల్లో నమీబియాతో శ్రీలంక.. నెదర్లాండ్స్‌తో యూఏఈ ఢీ కొననున్నాయి. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసిన టీ20 ఫార్మాట్‌లో ఎనిమిదో వరల్డ్‌కప్‌నకు సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి వచ్చే నెల 13 వరకు మెగాటోర్నీ జరుగనుండగా.. ఇందులో భాగంగా తొలుత క్వాలిఫయింగ్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు. ఆతిథ్య హోదాలో ఆసీస్‌ నేరుగా సూపర్‌-12 చేరగా.. భారత్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు ర్యాంకింగ్స్‌ ఆధారంగా అర్హత సాధించాయి. ఏకపక్ష మ్యాచ్‌లకు స్వస్తి పలకాలనే ఉద్దేశంలో.. మరో ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌-‘ఎ’ నుంచి నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, నమీబియా బరిలోకి దిగుతుండగా.. గ్రూప్‌-‘బి’లో ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement