Thursday, May 2, 2024

రేప్‌ చేస్తామని బెదిరస్తున్నారు.. పోలీసులకు మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మ‌లివాల్‌ ఫిర్యాదు

లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ నిర్మాత సాజిద్‌ఖాన్‌ను బిగ్‌బాస్‌ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ (DCW) స్వాతి మలివాల్‌ లేఖ రాశారు. ఆ లేఖ రాసిన‌ప్ప‌టి నుంచి త‌న‌ను రేప్‌ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బుధవారం ఆమె తెలిపారు. సాజిద్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపులకు దిగుతూ.. సహజంగానే త‌మ పనిని అడ్డుకునే య‌త్నం చేస్తున్నారు. ఈ విషయంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాల‌ని స్వాతిమ‌లివాల్ ట్వీట్ ద్వారా కోరారు.

MeToo ఉద్యమం సందర్భంగా పది మంది మహిళల నుంచి సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సాజాద్‌ ఖాన్‌పై వచ్చిన ఫిర్యాదులు.. అతని అసహ్యకరమైన మనస్తత్వాన్ని తెలియ‌జేస్తున్నాయ‌ని, తప్పుడు వ్యక్తికి బిగ్‌బాస్‌లో చోటు కల్పించారని, అతన్ని షో నుంచి పంపించాల‌ని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఢిల్లీ విమెన్స్ క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ లేక‌ రాసినట్లు ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 1న బిగ్‌బాస్‌-16 సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. షోలో చిత్ర నిర్మాత సాజిద్‌ ఖాన్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2018లో సాజిద్‌ ప్రాజెక్టుల్లో పని చేసిన పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సలోని చోప్రా, షెర్లిన్ చోప్రా, అహానా కుమ్రా, మందన కరీమి తదితర నటీమణులు ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement