Tuesday, May 14, 2024

ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్​గా ఇంప్లిమెంట్​.. బ్రేక్ చేస్తే జైలుకే!

ఏప్రిల్‌ నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తామని హెచ్చరించారు. కోవిడ్ కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చామని.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చ‌రించారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో స్పీడ్ లిమిట్ విధానం అమల్లోకి తెస్తామని చెప్పారు ట్రాఫిక్ జాయింట్ సీపీ. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై కూడా కఠిన చర్యలు ఉంటాయని.. తాగి వాహనం నడిపేతే జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. వాహనాల అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ అంటించరాదని.. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్స్ వేసుకొని తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్స్ మాత్రమే వాడాలని.. రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు రంగనాథ్.

ఇక‌.. తెలంగాణలో పెండింగ్ చ‌లాన్లపై పోలీస్ శాఖ ఇచ్చిన బంఫర్ ఆఫర్ కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. 650కోట్ల రూపాయలకు పైగా విలువైన పెండింగ్ చ‌లాన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. రాయితీ పోనూ 190 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 85 లక్షల చ‌లాన్లు క్లియర్ చేశారని.. రోజుకు 7 నుండి 10 లక్షల పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాయితీ ఆఫర్ మార్చి 31 దాకా మాత్రమేనని, పొడిగించే చాన్స్ లేద‌ని స్పష్టం చేశారు. 15 వందల కోట్ల విలువ చేసే చ‌లాన్లు పెండింగ్ ఉన్నాయని.. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు రంగనాథ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement