Friday, May 10, 2024

పలుగు, పార పట్టిన పాఠాలు వినాల్సిన విద్యార్థులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని ఓ బడిలో పాఠాలు వినాల్సిన విద్యార్థులతో పలుగు, పార పట్టించి సుమారు వంద మీటర్ల వరకూ గుంతలు తీయించాడో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్. నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థులచే పనిచేయించడం పట్ల స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.

గుమ్మగట్ట మండలంలోని కలుగోడు జెడ్పీ హైస్కూలులో గత కొంతకాలంగా తాగునీటి పైపు లైన్ మరమ్మతులకు గురైంది. పాఠశాల కమిటీ అనుమతితో కూలీలతో పని చేయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కమిటీ ఛైర్మన్‌కు కూడా తెలియకుండా పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను పురమాయించి వారితో గుణపం, పార పట్టించి బుధవారం పని చేయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ విద్యార్థులు సుమారు వంద మీటర్ల మేర గుంతలు తీశారు. ఈ పని మెత్తం హెచ్ఎం దగ్గర ఉండి మరీ చేయించారు. ఇది గమనించిన గ్రామస్తులు కొందరు హెచ్ఎం తీరుపై విమర్శలు గుప్పించారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ మల్లికార్జునను వివరణ కోరగా తమకు తెలియకుండా జరిగిందని, ఈ విషయంపై హెచ్ఎంను వివరణ కోరుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement