Saturday, April 27, 2024

Telangana | పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం.. మోతె బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. జ‌గిత్యాల జిల్లా మోతెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘వరద కాలువ కథ రాస్తే రామయణం అంత.. చెబితే భారతమంతా. దానికి తూములు, కాలువలుండవ్‌. అందులో చేరిన గుంత‌ల్లో కరెంటు మోటార్లు పెట్టి అద్దెకరం పారిస్తే ఆ నాడు మోటార్ల తీగలు కోసేసి కాలువలో తోసేసిన కష్టాలు నాకు తెలుసు. వరద కాలువను రిజర్వాయర్‌గా, జీవనదిగా మార్చుకున్నాం. ఎన్ని తుములు అవసరమో అన్ని పెట్టుకున్నాం. వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సుభిక్షంగా పంటలు పండించుకుంటున్నాం.

ఈ రోజు కూడా వరద కాలువ మీద సుమారు 13వేల మోటార్లు ఉన్నయ్‌. రైతులు పంటలు పండిస్తరు. రైతులకు పంటలు పండించేందుకు ఆనాడు తెలంగాణలో, కరువులో పెరుగన్నం పురుగు మందులు తాగి, దుబాయి, ముంబాయికి అనేక బాధలు పడి చెట్టుకొకరైన గుట్టకొకరైన తెలంగాణ రైతులు బాగుపడాలని చెప్పాను. ఖచ్చితంగా అద్భుతమైన వనరుగా మార్చుకుందాం.. సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పాను. 24 గంటల కరెంటు ఇస్తున్నాం. సంవత్సరానికి 13,14వేలకోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం కోరుట్ల, మెట్‌పల్లి, చొప్పదండి, కరీంనగర్‌ ప్రాంత వాసులకు బాగా తెలుసు. ఎన్ని మోటార్లు పెట్టావ్‌? ఎంత హెచ్‌పీలు ఉన్నయ్‌? ఎంత బిల్లు కడుతువ్‌ అని అడిగే కొడుకు ఉన్నడా? దానికి మీటర్లు పెట్టమంటున్నరు? వరద కాలువ తూముల్లో మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం’ అన్నారు.

రైతుబంధు ఇచ్చేది అందుకే..
‘ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదు. రైతుబీమా ఇచ్చే దేశం లేదు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చేది తెలంగాణ. అనాలోచితంగా, ఆగమాంగ ఇచ్చేది కాదు. చితికిపోయి, ఛిద్రమైన ఆగమైన తెలంగాణ రైతుల బతుకులు ఓదరికి రావాలని, అప్పులు తీరాలని, ఆ బాధలు తప్పాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్‌, రైతుబీమా, రైతుబంధు. అంతటితో ఆగకుండా భారతదేశంలో ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయదు. ఎక్కడా లేనివిధంగా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే రంది లేకుండా, అమ్మిన పంటకు ఐదురోజుల్లోనే బ్యాంకులు డబ్బులు వచ్చేలా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు వస్తది? ఇంకో ఐదుపది రోజుల్లో రైతుబంధు పడుతుంది? పడాలి కదా? ఎట్ల పడుతది.. బ్యాంకుల్లో పడంగనే టింగుటింగుమని ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తది.

- Advertisement -

ఎల్లుండి క్యాబినెట్‌ మీటింగ్‌ ఉంది. అక్కడ నిర్ణయం తీసుకొని ఖాతాల్లో జమ చేస్తాం. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్‌ బతికున్న వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదు. కొన్ని పనులు పూర్తి కావాలి. వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్‌, బీమారం సూరమ్మ చెరువు నింపి మూడు మండలాలకు నీరిస్తాం. మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం కొట్లాడుతున్నడు. త్వరలో మంజూరు చేసి లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తాం. పోతారం, నారాయణపూర్‌ రిజర్వార్లను పూర్తి చేస్తాం. కేసీఆర్‌ కన్నా ముందు, టీఆర్‌ఎస్‌కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశారు. ఈ ప్రాంతం నుంచి మంత్రులను చూశారు. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులున్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా తెలంగాణలో రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నాం. రేషన్‌కార్డులతో బియ్యం, పిల్లలకు ఉద్యోగం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం, కల్యాణలక్ష్మి కింద వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement