Thursday, May 2, 2024

రూ.1000 కోట్లు ‘ఫిష్‌ ఇన్‌’ పెట్టుబడి – మిడ్‌ మానేరు వద్ద చేపల ప్రాసెసింగ్ కేంద్రం: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ఫిష్‌ ఇన్‌ కంపెనీ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. బుధవారం అమెరికాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్‌, సీఈవో మనీష్‌ కుమార్‌ పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1000 కోట్లతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టంను డెవలప్‌ చేసేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనున్నట్లు చెప్పారు. చేపల ఉత్పత్తిలో హాచరీలు, దాణా తయారీ, కేజ్‌ కల్చర్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో ”ఫిష్‌ ఇన్‌” కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోందని కంపెనీ సీఈవో మనీష్‌ కుమార్‌ తెలిపారు.

తెలంగాణలో కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85వేల మెట్రిక్‌ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇంత భారీ పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్న ఫిష్‌ ఇన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి, మిడ్‌ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు. చేపల పెంపకానికి సంబంధించి ఇప్పటికే వారి వద్ద ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కంపెనీ సీఈవో మనీష్‌కు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement