Thursday, May 2, 2024

రేవంత్‌రెడ్డి ఓ కమెడియన్‌, చిప్ప కూడు తిన్నాక చిప్‌ దొబ్బింది: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ కమెడియన్‌లా మారిపోయాడని, పరిగి సభలో ఆయన కల్లు తాగిన కోతిలా వ్యవహరించారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, జీవన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌ మండిపడ్డారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ లేని రేవంత్‌రెడ్డి సమైక్య వాదుల చెప్పులు మోశారన్నారు. రేవంత్‌ నోటి వెంట కుంభ కోణాలు తప్ప మరో పదం రావడం లేదన్నారు. ‘రేవంత్‌, వేల కోట్లు, అవినీతి పర్యాయ పదాలుగా మారిపోయాయి. రేవంత్‌కు విషం తప్ప విషయ పరిజ్ఞానం లేదు. ఈ మధ్య రేవంత్‌ మాట్లాడిన ఇంగ్లీష్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. రేవంత్‌ ఎంపీగా ఉన్నారు. ఇంగ్లీష్‌కు ట్యూటర్‌ను పెట్టుకుంటే మంచిది. బట్లర్‌ ఇంగ్లీష్‌ను భరించ లేకపోతున్నారు.

సత్య నాదెళ్ల ఏ సంస్థకు సీఈవోనో కూడా రేవంత్‌కు తెలియదు. రేవంత్‌కు నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్‌ తెలంగాణకు పప్పుగా తయారయ్యాడు. వ్యవసాయం గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జైలులో చిప్ప కూడు తిన్నాక రేవంత్‌ చిప్‌ దొబ్బింది. రేవంత్‌ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖర్చులుంటే మేము భరిస్తాం. కాంగ్రెస్‌కు రేవంతే ఉరి తాడుగా మారారు. ఒడిశాలో సింగరేణికి చెందినకోల్‌ బ్లాక్‌లో 50వేల కోట్ల కుంభకోణం జరిగిందంటున్నారు. అస్సలు ఆ నైని కోల్‌ బ్లాక్‌లో బొగ్గు విలువ కూడా 50వేల కోట్లు లేదని రేవంత్‌కు తెలుసా. సింగరేణి టర్నోవర్‌ ఎంతో రేవంత్‌కు తెలుసా.. సింగరేణి సంస్థను విమర్శించడానికి సిగ్గుగా అనిపించడం లేదా… సింగరేణి ప్రైవేటీకరణను పార్లమెంటులో ప్రశ్నించాల్సింది పోయి బీజేపీతో కుమ్మకై రేవంత్‌ కేసీఆర్‌ను తిడుతున్నారు. రేవంత్‌ బీజేపీ కోవర్ట్‌ అనే అనుమానం కలుగుతోంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ సీనియర్లను బయటికి పంపించి కాంగ్రెస్‌ను బీజేపీకి అమ్మే పనిలో రేవంత్‌ ఉన్నాడు. కాంగ్రెస్‌ కార్యకర్తలే రేవంత్‌కు ఉరితాడు బిగించే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఆధారరహితంగా అవినీతి ఆరోపణలు చేసే జోకర్‌ రేవంత్‌ అనే సంగతి ఎన్నో సందర్భాల్లో రుజువైంది. రేవంత్‌రెడ్డి పరిగిలో పనికి మాలిన మాటలు మాట్లాడారు. వాటిని తెలంగాణ బిడ్డలెవ్వరూ సమర్ధించరు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను కాంగ్రెస్‌లో ఎవ్వరూ గుర్తించడం లేదు. అందుకే ఉనికి ని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఓటుకు నోటు కేటుగాడు పెద్ద పోటుగాడిలా పోజు కొట్టి మాట్లాడుతున్నాడు. తుపాకి రాముడి తుప్పు మాటలతో కాంగ్రెస్‌కు, తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కొల్లగొట్టిన పార్టీల జెండాలు మోసిన రేవంత్‌ ఇపుడు చిలక పలుకులు వల్లిస్తున్నాడు. బాయిల్డ్‌ రైస్‌ కొనమని అన్న కేంద్రాన్ని వదిలేసి రేవంత్‌ కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే వచ్చే లాభం ఏమీ లేదు. రేవంత్‌ తన కార్యక్రమం పేరు మన పార్టీ మన పోరు అని మార్చుకుంటే మంచిది. రేవంత్‌ రెడ్డికి కళ్ళు దొబ్బాయి అందుకే కుళ్లు మాటలు మాట్లాడుతున్నారు.

 తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌. తెలంగాణ బడ్జెట్‌ను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా మెచ్చుకున్నారు. కేసీఆర్‌ తెలంగాణ బంధు అయితే రేవంత్‌ తెలంగాణ పాలిట తాలిబన్‌లా మారారు .కాంగ్రెస్‌కు ఊరు లేదు ఏరూ లేదు. అభివృద్ధి తెలంగాణ ప్రజల జన్మ హక్కు అయితే అవినీతి అబద్దాలు రేవంత్‌ జన్మ హాక్కులా మారిపోయాయి. కాంగ్రెస్‌కు ప్రజలు ఎపుడో ఉరి వేశారు. రేవంత్‌వి తుపాకీ రాముడి తుప్పు మాటలు. నీళ్లు నిధులు నియామకాలపై రేవంత్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రేవంత్‌ సన్‌ ఆఫ్‌ కరప్షన్‌లా మారారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని రేవంత్‌ అడిగిన ప్రశ్నకే పార్లమెంటులో కేంద్రం జవాబిచ్చింది. అయినా రేవంత్‌ లోఫర్‌లా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే రేవంత్‌ను ఊరంతా ఉరికించి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఉద్యమంలో ఉన్నపుడు రేవంత్‌ వారిని ఉద్యమంలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించలేదు.

రేవంత్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రేవంత్‌రెడ్డి అవినీతి పరుడు కాకపోతే జూబ్లీహిల్స్ లో ఇన్ని ఇండ్లు, స్థలాలు ఎక్కడివి. రేవంత్‌ బ్లాక్‌ మెయిల్‌ గురించి ఎవ్వరిని అడిగినా చెబుతారు. మేము తలచుకుంటే జూబ్లీహిల్స్ లో తన ఇంటి నుంచి రేవంత్‌ కాలు కూడా బయట పెట్టలేరు. కేసీఆర్‌ కుటుంబం గురించి రేవంత్‌ మాట్లాడితే ఆయన కుటుంబం కాంగ్రెస్‌ నేతల కుటుంబాల గురించి మేము మాట్లాడాల్సి ఉంటుంది. రాజకీయాల్లో రేవంత్‌ ఓ బచ్చా. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ హూందాగా ఉంటే మంచిది’ అని బాల్క, జీవన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌లు హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement