Saturday, April 27, 2024

Punjab polls 2022: పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయండి: ఈసీకి సీఎం చన్నీ లేఖ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఫిబ్రవరి 16న శ్రీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన చాలా మంది ప్రజలు వారణాసిని సందర్శించే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని చన్నీ అభ్యర్థించారు.

రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాదాపు 20 లక్షల మంది ఫిబ్రవరి 10-16 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ను సందర్శిస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగితే వారు ఓటు హక్కును వినియోగించు కోలేరని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని కోరారు.

మరోవైపు పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న 86 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ చామ్‌కూర్ సాహిబ్ నుంచి పోటీ చేస్తుండగా, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఇక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement