Thursday, May 2, 2024

AP : అబద్ధాలు ఆడను..మోసం చేయను…మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం

మా హయాంలోనే మేనిఫెస్టోకి విలువ ఏర్పడింది
2019 మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం
₹2,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం
తాము చేయగలిగిందే చెబుతాం
అన్నింటిలో సామాజిక న్యాయం పాటించాం
మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేను
రుణమాఫీ, డ్వాక్రా రుణాల విషయంలో బాబు మోసం
ప్రత్యేక హోదా సంజీవనా? అని వెటకారం చేశాడు
విశ్వసనీయత లేని రాజకీయాలు దేని కోసం
సంపద సృష్టిస్తాడట.. కనీసం సిగ్గుండాలి
మేనిఫెస్టో రిలీజ్‌లో మాటల తూటాలు పేల్చిన జగన్​

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడడు. ఎవ‌రినీ మోసం చేయడు. పేదలను ప్రేమించి, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా.. పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వేయలేరు. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా పేదవాళ్ల కోసం అడుగులు వేస్తాడు. పేదవాళ్లకు మంచి చేసే విషయంలో జగన్‌కు ఉన్న ప్రేమ మరెవరికీ ఉండదు.. ఉండబోదు. జగన్‌కు మనసు ఉంది. కల్మషం లేదు. అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండు పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను శనివారం తాడేపల్లిలో విడుదల చేశారు.

- Advertisement -

తొమ్మిది ముఖ్య‌మైన హామీలు..

ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. 9 ముఖ్యమైన హామీలతోమేనిఫెస్టోను చదివి వినిపించారు. విద్య, ఆరోగ్యం, అభివృద్ధి తదితర అంశాలపై హామీలు ఇచ్చారు. అంతక ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించాం. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం.కానీ, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం అన్నారు.

మోసాల్లో బాబుతో పోటీ పడలేదు

2014లోనూ నాకు బాగా గుర్తుంది. ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పాం. అమలు చేసినా, చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది నా మంచి కోసమంటూ చెప్పారు. కానీ, నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా. ఇదీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలి. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు.

ప్రత్యేక హోదా సంజీవనా? అని ప్రశ్నించలేదా?

ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా?. ముఖ్యమై హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసింది. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్ ను మించి రాష్ట్రాని- అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు?అని చంద్రబాబును సీఎం జగన్ ప్రశ్నించారు.

సామాజిక న్యాయం పాటించాం

మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోంది. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం. చట్టం అమలు చేసి 50 శాతం రిజర్వేషన్లతో నామినేటెడ్ పదవులు ఇచ్చాం.బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులిచ్చాం. 60 శాతం మంత్రి పదవులు పేద విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామీణ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించాం. పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ లేకుండా చేశాం.2014-.. 19 మధ్య 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గత 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. మేం ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశాం అని సీఎం జగన్ వివరించారు.

సంపద ఎలా సృష్టిస్తారు?

ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్ మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదు. జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదు. చంద్రబాబు చెబుతున్న పథకాలను రూ.1,21,000 కోట్లు అవసరం. మనం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి రూ. 29,100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అంటే.. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాల కలిపి అమలు అమలు చేయాలంటే కచ్చితంగా అక్షరాల లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం?మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టిని పరిశీలిస్తే.. ప్రతీ ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించింది. మరి ఎక్కడ సృష్టించారు? తాను సంపద సృష్టించానని చంద్రబాబు సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు? అని సీఎం జగన్ నిలదీశారు.

నవరత్నాలకు
మెరుగులు
సంక్షేమానికే పెద్ద పీట
విద్య, ఆరోగ్యం, రైతన్న, మహిళాసాధికారిత ప్రధానాంశాలు
తిరుపతిలో స్కిల్ వర్సిటీ
లారీ డ్రైవర్లకూ వాహన మిత్ర
సున్నా వడ్డీ రుణం రూ.3లక్షలు
స్విగ్గీ, జోమాటో డెలివరీ బాయ్లకూ బీమా

= రెండు పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. ప్రస్తుత నవరత్నాల విస్తరణ.. 9 ముఖ్య హామీలు ప్రకటించారు.
= రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 లకు పెంపుదల
(2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం)
66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం
అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు
వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
అమ్మ ఒడి రెండు వేలకు పెంపుదల. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం
వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ (ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)
వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగింపు..
నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ. లక్షా 20వేలకు పెంపు
నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి రూ. 1,05.000లకు పెంచుతాం
వైస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతాం
కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత
వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం
ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ.
ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు
వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ. లక్ష లకు పెంచుతాం
లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.
రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున, ఐదేళ్లలో రూ1,20.000 చెల్లిస్తాం
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, లా నేస్తం యథావిధిగా కొనసాగింపు
అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు
నాడు-నేడు..ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్
ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్.. జిల్లాకో నైపుణ్య అభివృద్ధి కాలేజీ.. తిరుపతిలో స్కిల్ వర్సిటీ
స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా వర్తింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement