Friday, May 3, 2024

Danger Dogs| బర్రెను కరిచిన పిచ్చి కుక్క.. ఆ పాలు తాగిన దుడ్డె రేబిస్​తో మృతి, గ్రామంలో ఆందోళన

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో రేబిస్ వ్యాధితో బర్రె దుడ్డె చనిపోయింది. ఇది ఇప్పుడు ఆ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఆ బర్రెపాలను చాలామంది తాగుతుండటమే దీనికి కారణం. బర్రె దుడ్డె మృతితో గ్రామస్తుల్లో భయం పట్టుకుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన  వైద్యఆరోగ్యశాఖ అధికారులు శనివారం 300 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేశారు. పిచ్చి కుక్క కాటుకుగురైన తల్లి బర్రె పాలు తాగి దుడ్డె చనిపోవడంతో ఈ వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండ్రోజుల క్రితం ఓ రైతుకు చెందిన బర్రెను పిచ్చి కుక్క కరిచింది. అయితే ఆ బర్రెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదని గ్రామస్తులు తెలిపారు. కాగా, ఆ రైతు బర్రె నుంచి పితికిన పాలను గ్రామస్తులకు  సరఫరా చేస్తూనే ఉన్నాడు. కానీ, తల్లి బర్రె పాలపై ఆధారపడ్డ దుడ్డె రేబిస్​ సోకి చనిపోవడంతో ఇప్పుడు గ్రామంలో ఆందోళన మొదలయ్యింది. ఆ ఊరి ప్రజలంతా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామ అధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని డిసైడ్​ అయ్యారు.

- Advertisement -

ఇక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఇప్పటికే భయాందోళనకు గురి చేస్తోంది. మూడు నెలల్లో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లాలో శుక్రవారం ఎనిమిదేళ్ల చిన్నారిని వీధికుక్కలు కొరికి చంపేశాయి. వరంగల్ జిల్లాలో ఇది రెండో ఘటన. గత నెలలో వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు కొరికి చంపాయి. ఖమ్మం జిల్లాలో మార్చి నెలలో రేబిస్ వ్యాధితో ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. అతన్ని వీధికుక్కలు కరిచాయి. తరువాత రేబిస్ లక్షణాలు కనిపించినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement