Wednesday, May 1, 2024

నియోకోవ్ తో ప్రాణ భ‌యం లేదు.. భారత వైద్య నిపుణుల విశ్లేష‌ణ‌..

నియోకోవ్‌ అనే కొత్తరకం కరోనావైరస్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.
దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్‌, అత్యంత ప్రమాదకరమని, వైరస్‌ సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు మరణిస్తారని వుహాన్‌ ల్యాబ్ నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్‌ గురించి మనదేశ బయో శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేశారు. దీనితో ముప్పేమీ లేదని ప్రాథమికంగా తేల్చారు. వాస్తవానికి ఇదేమీ కొత్త వైరస్ కాదని, పాతవైరస్‌ మెర్స్‌కోవ్‌కి దగ్గరి సబంధం కలిగివుందని స్పష్టంచేశారు. వుహాన్ విశ్వవిద్యాలయం, చైనీస్‌ అకాడమి ఆఫ్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ శాస్త్రవేత్తల ప్రకారం, నియోకోవ్‌ వైరస్ 2012-15 కాలంలో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌ (మెర్స్‌-కోవ్‌) వ్యాప్తితో సంబంధం కలిగివుంది. ఇది కూడా సార్స్‌కోవ్‌-2 మాదిరిగానే ఉంటుంది.

ఏదేమైనప్పటికీ, ఏస్‌-2 గ్రాహకాలను ఉపయోగించే వైరస్‌ గణనీయమైన మ్యుటేషన్‌ చెందితే తప్ప, మానవ ఏస్‌-2 గ్రాహకాలను చేరలేదని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ గురించి చెబుతున్నదంతా ఊహాజనితమేనని మహారాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి తెలిపారు. ఢిల్లికి చెందిన సీఎస్‌ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటెటివ్‌ బయాలజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్ వినోద్‌ స్కారియా సైతం నియోకోవ్‌ గురించి మరణాల భయం అక్కర్లేదని చెప్పారు. ఈ వైరస్‌ సహజ రూపంలో మనుషులకు సోకదని, ఇప్పటి వరకు ఎవరికీ సోకలేదని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement