Monday, April 29, 2024

Karnataka CM  | కన్నడ సీఎం విషయంలో క్లారిటీ.. డీకే​ నిర్ణయం ఇదేనా?

అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి కన్నడ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్​ పార్టీకి అధిక మెజార్టీ కట్టబెట్టారు. కన్నడ ప్రజల మనస్సు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరో పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఎన్నో ఊహాగానాల మధ్య కర్నాటక సీఎం ఎవరనే ప్రశ్న ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తోంది.. అయితే, ఇట్లాంటి రూమర్లు, చిట్​చాట్​లకు చెక్​పెట్టేలా కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ తన నిర్ణయం ప్రకటించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటకలో బీజేపీని చిత్తుగా ఓడించి, విజయాన్ని అందుకున్న కాంగ్రెస్​కు మరో సవాల్​ ఎదురుకాబోతంది. ఆ పార్టీ నుంచి సీనియర్​ లీడర్​, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు.. కష్టాల్లో అండగా నిలిచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్న పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. అయితే.. చాలామంది డీకేకు సీఎంగా అవకాశాలు కల్పించాలని కోరుతుంటే, మరికొందరు సిద్ధరామయ్యకే ఇవ్వాలని అంటున్నారు.

వీటన్నిటి నడుము.. కర్నాటక ముఖ్యమంత్రి ఎవరు? అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇవ్వాల (ఆదివారం) కుండబద్ధలు కొట్టారు. కనకపుర నియోజకవర్గం నుంచి గెలుపొందిన శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశానని, సిద్ధరామయ్యకు అండగా నిలిచానని చెప్పారు. ఇప్పుడు కూడా సిద్ధరామయ్యకు తన సహకారం ఉంటుందన్నారు.

- Advertisement -

‘‘నాకు సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. కానీ, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేను స్పష్టం చేయాలి అనుకుంటున్నాను. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి సిద్ధరామయ్యకు అండగా నిలిచాను. నేను సిద్ధరామయ్యకు సహకారం అందించాను’’ అని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే అన్నారు.

కాగా, పలు నివేదికల ప్రకారం.. తదుపరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అవుతారో నిర్ణయించడానికి పార్టీ హైకమాండ్‌కు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లీడర్లు ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఇక.. విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ అగ్రశ్రేణి ఈ విజయాన్ని “లోక్‌సభ ఎన్నికలకు సోపానం”గా అభిర్ణించింది. కనకపుర నియోజకవర్గంలో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అభ్యర్థి బీ నాగరాజుపై డీకే శివకుమార్ 1,43,023 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరుణ అసెంబ్లీ స్థానం నుంచి సిద్ధరామయ్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వి. సోమన్నపై గెలుపొందారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపిన వివరాల ప్రకారం దక్షిణాదిలో బీజేపీ పాలనను దూరం చేసి, కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement