పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఆవిర్భావ వేడుకలు ఈ నెల 14న జరగనున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో అట్టహాసంగా వేడుకలను నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నా.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మర్ నాదెండ్ల మనోహర్ ఎక్కడ చిన్న లోటు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి వేడుకలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. సభా వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టిన జనసేన.. వేడుకలను విజయవంతం చేసేందుకు ఏకంగా 12 కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో ఏపీతో పాటు తెలంగాణకు చెందిన నేతలకు కూడా చోటు కల్పించారు. తాజాగా మరో ఇద్దరు నేతలను ఈ కమిటీల్లో నియమిస్తున్నట్లుగా పవన్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ ప్రకటించారు. ఈ కొత్త నియామకాల్లో భాగంగా ప్రచార కమిటీలో వెంకట ప్రసాద్, వాలంటీర్స్ కమిటీలో రామకృష్ణకు చోటు కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement