Sunday, April 28, 2024

చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు.. కల్యాణోత్సవంలో మంత్రి హరీష్ పూజలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి రోజు పురస్కరించుకుని ఆదివారం మంత్రి హరీశ్ రావు విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవం, శిఖర సంప్రోక్షణ, కల్యాణోత్సవంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టాభిరాముల కళ్యాణోత్సవ సందర్భంగా పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణలు చేసి సీతారామ స్వామివారికి సమర్పించారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులుతో చింతలు లేని మడకగా చింతమడక గ్రామాభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీరాముల వారు కుటుంబ సమేతంగా ఉన్న ఏకశిలా విగ్రహం చింతమడకలో ఉండటం గ్రామ ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. రూ.3 కోట్లతో శివాలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రాముడి దీవెనలతో కలలో కూడా జరగని కాళేశ్వరం పనిని సీఎం కేసీఆర్ కృషితో చేసుకున్నామని చెప్పారు. గ్రామంలో చెరువులు, కాల్వలు, జలకళతో నిండాయని తెలిపారు. మండు టెండలల్లో గోదావరి జలాలు పారి పరవళ్లు తొక్కుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement