Tuesday, May 7, 2024

వరంగల్ లో భగ్గుమన్న టీఆర్ఎస్ శ్రేణులు.. నల్ల బ్యాడ్జీలతో ధర్నాలు

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా బైక్ ర్యాలీలలో పాల్గొని ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణపై దాడికి బీజేపీ కుట్ర చేస్తున్నదన్నారు. ప్రధాని రాజ్యసభలో తెలంగాణ విభజనపై విషం కక్కారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కెసీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాజ్యాంగబద్దంగా విభజన జరిగిందన్నారు. తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, కించపరచడమేనని మంత్రి చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్నారు. చివరకు మన పథకాలను కాపీ కొట్టి దేశంలో అమలు చేసే దిక్కుమాలిన తెలివి బీజేపీదని ఎద్దేవా చేశారు. తెలంగాణపై మరో కుట్రకు బీజేపీ తెర లేపిందని, దాన్ని తిప్పికొట్టే బాధ్యత ప్రజలతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలది అని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలను కులం, మతం పేరుతో విభజించి పాలించే దిగజారుడు రాజకీయాలకు బీజేపీ  పాల్పడుతున్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజలని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement