Saturday, April 27, 2024

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై సూపర్ మార్కెట్లులోనూ మద్యం అమ్మకాలు

మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే స్వీట్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి సూపర్ మార్కెట్లలో కిరాణా పచేరీ కొనుగోలు చేస్తున్నట్టుగా మద్యాన్ని కొనేయవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తయారైన వైన్‌లను విక్రయించడానికి అన్ని సూపర్ మార్కెట్‌లకు గురువారం అనుమతినిచ్చిందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే కేవలం లిక్కర్ షాపుల్లో మాత్రమే మద్యం క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీతో సూపర్ మార్కెట్లలో కూడా వైన్ బాటిల్స్ లభ్యమవుతాయి. చిన్న, మధ్య తరహా వైనరీస్‌ను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. పండ్ల ఆధారిత వైన్ ఉత్పత్తులకు ప్రేరణ లభించాలనే ఉద్దేశ్యంలో పదేళ్లపాటు జీఎస్టీ రద్దు చేసినట్టు మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫలితంగా రైతులకు లాభం చేకూరుతుందన్నారు.

ఇప్పుడు కొత్త మద్యం పాలసీలో భాగంగా చిన్న, మధ్య స్థాయి వైనరీస్‌కు ప్రోత్సాహం, పొమోషన్ చేసేందుకు వేయి చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాల్లో స్టాల్ లేదా షోకేజ్ ఏర్పాటు చేసి విక్రయించుకోవచ్చు. అంటే ఇక నుంచి మందుబాబులు నేరుగా కిరాణా సామాను కొన్నట్టే..మందు కొనుగోలు చేయవచ్చు లేదా కిరాణా సామానుతో పాటే మద్యం బాటిల్స్‌కు ఆర్డర్ చేసేయవచ్చు. అయితే ప్రార్థన మందిరాలు, విద్యా సంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్ లోకి మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్యం నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు 5000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement