వినియోగదారులకు మరో షాక్. గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఈ నెల 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్పై పెంచింది. 14 కేజీల సిలిండర్పై రూ.50 వడ్డించింది. ఈ మేరకు దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
ఇప్పటికే దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపుదల చోటు చేసుకుంది. LPG ధరల పెంపు భారతదేశంలోని సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య LPG సిలిండర్ల ధరలను పెంచారు. మే 1న, 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 102.50 పెరిగి, రూ.2355.50కి, అంతకుముందు రూ.2253కి పెరిగింది. అలాగే 5 కిలోల ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధరను రూ.655కి పెంచారు.