Tuesday, May 7, 2024

TS | వరంగల్​లో ఇన్నర్​ రింగ్​రోడ్​, మోడ్రన్​ బస్​ స్టేషన్.. రేపు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్​​

వరంగల్​ జిల్లాలో రేపు (శనివారం) మంత్రి కేటీ రామారావు పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) ఆధునిక బస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిని హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు 13 కిలోమీటర్ల మేర ఐఆర్‌ఆర్‌ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తొలిదశలో ఖమ్మం రహదారిపై ఆర్‌టీఓ కార్యాలయం, నాయుడు పెట్రోల్ బంక్ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మీదుగా 200 మీటర్ల వెడల్పుతో 8 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. 315 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టే బాధ్యతను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)కి అప్పగించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన 80 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించగా, దేవాదాయ శాఖకు ఇంకా 35 ఎకరాలు రావాల్సి ఉంది.

- Advertisement -

ఖమ్మం హైవే నుంచి నర్సంపేట రోడ్డు, ఏనుమాముల వరకు ఐఆర్‌ఆర్‌ నేరుగా ప్రవేశం కల్పిస్తుందని ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ), అజిత్‌రెడ్డి చెప్పారు. దీని ద్వారా ప్రజలు వరంగల్-ములుగు ఎన్‌హెచ్ 163కి ఈజీగా చేరుకోవచ్చని తెలిపారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, వరంగల్‌లో ట్రాఫిక్‌ రద్దీని అరికట్టడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు.

అదేవిధంగా.. వరంగల్‌లో రూ.74.50 కోట్లతో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జి 5 మోడల్‌లో 3 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించాలని కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (KUDA) ప్లాన్ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో TSRTC బస్సుల కోసం 32 ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి, ఐదు ఫ్లోర్లు వాణిజ్య స్థలాలకు ఉపయోగించనున్నారు. ఏడాదిలోగా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి ఆర్టీసీకి అప్పగించాలని అధికారులు టార్గెట్​ పెట్టుకున్నట్లు సీపీవో అజిత్ రెడ్డి తెలిపారు.

ఇక.. ఈ పర్యటనలో మంత్రి కేటీ రామారావు దూపకుంటలో రూ.106 కోట్లతో నిర్మించిన 2,200 డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా ప్రారంభించనున్నారు. తూర్పు నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలతో నిర్మించిన సిసి, బిటి రోడ్లను కూడా ప్రారంభిస్తారు. గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (GWMC) పరిమితుల కింద అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆయన ఫౌండేషన్​ వేయనున్నారు. మరోవైపు అదే రోజు పర్కాల నియోజకవర్గ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ (కేఎంటీపీ)లో యంగ్‌గోన్ కార్పొరేషన్ యూనిట్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement