హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. రెండు వారాలా పాటు అక్కడ కేటీఆర్ పర్యటన కొనసాగనున్నట్లు వెల్లడించారు. ప్రపంచానికి నీటి విజయాలకు సంబంధించిన పాఠాలను చెప్పడమే కాకుం డా పెట్టుబడులను ఆకర్షించేలా పర్యటన ఉండ నుంది. తెలంగాణలో అనుసరిస్తున్న నీటికి సంబంధించన వివరాలతో దునియాకు తెలప నున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజ నీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజనీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వారి ముందుంచనున్నారు. ప్రజెంటేషన్ రూపంలో వారికి అర్థం అయ్యేలా వివరించనున్నారు.
కాళేశ్వరం సక్సెస్ స్టోరీ
తెలంగాణలో సాగునీటి రంగంలో ఇప్పటికే సాధించిన విజయాలు.. సాధించబోతున్న విజయాలు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల గురించి సదస్సులో వివరించనున్నారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న సాగు, తాగు నీటి వివరాలను తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలపైన మంత్రి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2017లో అమెరికాలోని శాక్రమెంటో వేదికగా జరిగిన ఏఎస్సీఈ సదస్సులో మంత్రి కేటీఆర్ అప్పట్లో చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. మిషన్ భగీరథ గురించి చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏఎస్సీఈ 2022లో తెలంగాణలో పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ చేంజర్ అని ప్రశంసించింది. ఆ విజయగాథను, రాష్ట్ర ప్రభుత్వ ఘనతను వివరించేందుకు అమెరికాకు రావాలని ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్కి ఆహ్వానం పంపించింది.
పెట్టుబడులే లక్ష్యం
ఈ టూర్లో భాగంగా అమెరికాలోని పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పరిశ్రమలకు అనూకూలమైన వాతావరణ పరిస్థితులు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను మంత్రి వివరించనున్నారు. పలు కీలక ఒప్పందాలను కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.