Thursday, April 18, 2024

అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జ‌గ‌న్

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ముగింపు దశకు చేరింది. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం వైయ‌స్‌ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ వేదపండితుల మంత్రోచ్ఛరణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేడు పండితులు నిర్ణయించిన సుముహూర్తాన తిరిగి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగానే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement