నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థినుల లో దుస్తులను తొలగించిన వారిపై కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. కేరళ కొల్లాం జిల్లాలో సోమవారం జరిగిన NEET పరీక్షకు హాజరైన యువతులను పరీక్ష రాయాలంటే లో దుస్తులు తొలగించాలన్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కేరళ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354 (ఆమె నిరాడంబరతను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం) 509 (మహిళ అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొల్లాం జిల్లా ఆయుర్లోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో జరిగిన నీట్ పరీక్షకు హాజరవుతుండగా అవమానకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు ఓ యువతి ఫిర్యాదులో ఆరోపించింది.
దీంతో మహిళా అధికారుల బృందం బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని, ఈ చర్యకు పాల్పడిన friskersను త్వరలో అరెస్టు చేస్తామని వారు తెలిపారు. మొదటిసారి నీట్ పరీక్షకు హాజరైన తన కూతురికి బాధాకరమైన అనుభవం ఎదురయ్యిందని.. దాని నుంచి ఆమె ఇంకా బయటకు రాలేదని 17 ఏళ్ల బాలిక తండ్రి మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లో దుస్తులు లేకుండా 3 గంటల కంటే ఎక్కువ సమయం పరీక్ష కోసం కూర్చోవడం ఆమెను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ బులెటిన్లో అండర్గార్మెంట్స్ గురించి ఏమీ చెప్పలేదని.. వారి గైడ్ లైన్స్ ప్రకారమే.. అందులో పేర్కొన్న డ్రెస్ కోడ్ ప్రకారమే తన కుమార్తె దుస్తులు ధరించిందని తండ్రి ఒక టీవీ ఛానెల్తో చెప్పారు. దీంతో ఈ ఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ యువజన సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కొల్లం రూరల్ పోలీసు సూపరింటెండెంట్ను కమిషన్ ఆదేశించింది.