Thursday, May 9, 2024

కావల్సిన వనరులున్నా, వాడుకునే పరిస్థితి లేదు.. దేశ నేతలపై ప్లీనరీలో కేసీఆర్​ ఆగ్రహం

దేశంలో అన్ని వనరులున్నా.. వాటిని వినియోగించుకునే పద్ధతి లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరి ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతున్నారని, దేశానికి ఉజ్వలమైన ప్రస్థానం, అద్భుతమైన ఆవిష్కరణలు తెచ్చేటటువంటి అంశాలు రావడం లేదని ఆరోపించారు. ఇవి చూస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. ‘ఏం లేని సింగపూర్‌కు వెళ్లే టూరిస్ట్‌ల సంఖ్య ఎంత? భారతదేశానికి వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య ఎంత?. ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్‌, సర్వీస్‌ సెక్టార్లు అద్భుతంగా పురోగమిస్తున్నాయి. దేశం బాగుపడడానికి, దేశం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్న సెక్టార్లు. ప్రపంచంలోనే చాలా క్లీన్‌ బీచ్‌, అందంగా ఉండే బీచ్‌ బంగర్‌ ఐలాండ్‌ లక్షద్వీప్‌లో ఉంది. అక్కడి ఎవరూ రావడం రారు.. ఎవర్నీ రానియ్యం.. దానికి ప్రతిబంధకాలు.. ఉన్న వనరులను వాడుకునేందుకు పరిస్థితి లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ మన దౌర్భాగ్యం..
‘నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూర్‌ వెళ్లాను. అక్కడ ఎక్కడ ఏమీ లేవు ఓ బొమ్మ తప్ప. భారతదేశంలో ఉన్నటువంటి సహజమైన జలపాతాలు, అటవీ సంపద, వన్య మృగ సందప, శిల్పకళావైభవం, ఆర్ట్స్‌, పెయింటింగ్స్‌ ఇంకా ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? అంత గొప్పదనాన్ని వదిలి బొమ్మ వద్ద పిచ్చొళ్ల లెక్క ఫొటోలు దిగుతున్నం. మన దౌర్భాగ్యం ఇది. ప్రపంచమంతా మన దగ్గరకు రావాల్సింది పోయి.. మనం ఎక్కడికిపోతున్నమని నా బాధ్యత వ్యక్తం చేశాను. నేను ఒక్కటే చెబుతున్న.. కలలు కనవచ్చు.. వాటిని సాకారం చేసుకోవచ్చు. అది తెలంగాణ నిరూపించింది. 1987లో శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో కేరళకు వెళ్లాను. అక్కడ అధికారులో మాట్లాడితో మాకు చాలా కష్టం ఉందని చెప్పారు. మాకు భూభాగం తక్కువ, మంచి స్పైసెస్‌ పండే రాష్ట్రం.

మామూలు రూరల్‌ ఏరియాలో ఎకరానికి రూ.3కోట్లకు ధర ఉందని, ధరలు సేకరించలేకపోతున్నాం అని చెప్పారు. అదే అర్భన్‌ ఏరియాలు కొచ్చిన్‌, త్రివేండంలో ఎకరానికి రూ.10కోట్లు-12కోట్లు ఉందని 1987లో చెప్పారు. ఇబ్రహీంపట్నంలో సత్యనారాయణ అనే ఎమ్మెల్యే మిత్రుడు ఉండేవాడు. ఆయన ఇప్పుడు లేడు.. ఆయన విజ్ఞాన వంతుడు. మాతో కమిటీలో ఆంధ్రాకు చెందిన తులసీదాస్‌ వచ్చారు. వారితో మాటల సందర్భంలో ఇవాళ కేరళను చూస్తుంటే బాధ కలుగుతుంది. ఏదో ఒక రోజుకు తెలంగాణ రాష్ట్రం వస్తది?.. వస్తే కేరళలాగే భూముల ధరలు కూడా పెరుగుతయ్‌.. తెలంగాణ అలా ఉందని చెప్పాను.

నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా చెప్పానో నాకే తెలియదు. భగవంతు ప్రేరణో ఏంటో. మిత్రుడు నిరంజన్‌రెడ్డి వనపర్తికి తీసుకెళ్తే.. బస్సులో టౌన్‌ వెళ్తున్న సమయంలో ఎకరం భూమి ఉందని అడిగితే రూ.5కోట్లు ఉందని చెప్పిండు. ఊరి బయటకు వచ్చిన తర్వాత అడిగితే రూ.4కోట్లకు ఎకరం ఉందని చెప్పారు. ఇవాళ తెలంగాణ యావత్‌ ప్రజలు ఇబ్బందులు పడి అమ్ముకునే పరిస్థితులు లేవు. బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగనయ్‌. ఇంకా రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు వంద, 150 కిలోమీటర్ల రేడియస్‌లో మనకు కోట్లలోకి భూముల ధరలు వెళ్లే అవకాశం ఉంది. ఈ రకంగా తెలంగాణ పురోభివృద్ధి తెలంగాణ సాధిస్తున్నదని’ పేర్కొన్నారు.

స్థిరచిత్తంతో పని చేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా భారత్‌
‘భారతదేశానికి కూడా ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలంటే.. మనసు పెట్టి చేస్తే, స్థిరచిత్తంతో పని చేస్తే అమెరికానుమించిన ఆర్థికశక్తిగా భారతదేశం మారే అవకాశాలు సుసంపన్నంగా ఉన్నయ్‌. ప్రకృతి వనరులు, మానవ వనరులు, యువశక్తి, వాతావరణం, పర్యావరణం అన్నీ అనుకూలంగా ఉన్నయ్‌. అన్నీ ఉండి ఆగమైపోయిన భారతదేశానికి.. అందులో భాగంగా సఫరవుతున్న మనకు ఒక విముక్తి రావాలే. దాని కోసం తప్పకుండా నూటికి నూరు శాతం విజయం సాధిస్తామనే ఆలోచనన నాకున్నది. అది తప్పకుండా ఎజెండా ముందుకుపోతున్నదని అనుకుంటున్న. మన వంతు ప్రయత్నంగా దేశానికి ఒక కొత్త ఎజెండాను సెట్‌ చేసేందుకు ఓ సైనికుడిలా తప్పకుండా సభ ఆదేశాలను పాటించి నేను పని చేస్తానని మనవి చేస్తున్నాను’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోళ్లు జరిపించాలి..
ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మనమంతా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. శాసన సభ్యులంతా అందరు ఎక్కడికక్కడ ఒక్క గింజ కూడా ఇతరులకు అమ్మనివ్వకుండా కొనుగోలు కేంద్రాలను తెరిపించి, పూర్తిగా ధాన్యం సేకరించాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. కొత్త ఆలోచనలు కొనసాగిస్తూనే మన రాష్ట్రాన్ని మనం ఇలాగనే కొనసాగిద్దాం. ఒక మిత్రుడు ఎవరో అన్నారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే చాలా వనరులు కావాలి. చాలా డబ్బులు కావాలి. కేసీఆర్‌ మీరు ఎట్లా సమకూర్చుకుంటరని అడిగారు. తెలంగాణ నుంచి వెళ్తున్నరు కదా.. ఆ ప్రేరణ ఎట్ల అన్నరు. నేను ఒకటే చెప్పిన.. మా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి 60లక్షల మంది సభ్యులున్నరు.

ఒకరు కాదు ఇద్దరు కాదు. ఆ సభ్యులు కోటి రూపాయలు ఇచ్చే వారున్నరు.. పది రూపాయలు, వెయ్యి రూపాయలు, లక్ష రూపాయలు ఇచ్చేవారున్నరు. మేం తెలంగాణలాగనే.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి వెళ్తున్నం. మీ దీవెన కావాలని పార్టీ ఒక పిలుపునిస్తే.. యావరేజ్‌గా తలకు వెయ్యి పంపినా రూ.600కోట్లు అవుతాయని చెప్పిన. ఇవాళ నాకు రంది లేదు. ఎందుకు రంది లేదంటే ఒక్కో వక్త.. గంట కాదు రెండు గంటలు మాట్లాడేలా తయారయ్యారు. నేను ఆపాల్సి వస్తున్నది. చివరికి ఇవాళ అన్ని తీర్మానాలను పాస్‌ చేసుకోగలిగినం. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలుబడేటటువంటి, పర్మినెంట్‌గా తెలంగాణకు కంచుకోటగా ఉండేటటవుంటి గొప్ప పార్టీగా నిర్మాణం జరిగింది. అది సజీవంగా నా కండ్ల ముందు కనబడుతున్నది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement