Monday, April 29, 2024

TS | హైద‌రాబాద్‌లో దారుణం.. అన్న అంత్యక్రియలకు పైస‌ల్లేక ఏం చేశారంటే..

అనారోగ్యంతో చనిపోయిన త‌మ అన్న అంత్యక్రియలకు డబ్బుల్లేక‌, అతని తోబుట్టువులు ఘోరానికి పాల్పడ్డారు. మానవత్వాన్ని మరిచి చ‌నిపోయిన అన్న శరీరాన్ని ముక్కలుగా కోసం ఊరిబయట గోనె సంచిలో తీసుకెళ్లి పడేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని లంగ‌ర్‌హౌస్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది.

‌‌– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గండిపేట మండలం బండ్లగూడ ఎన్‌ఎఫ్‌సీ కాలనీలో నివసించే బాలమణికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలున్నారు. పెద్ద కొడుకు విజయ్‌కుమార్‌ పోస్టాఫీస్‌లో జాబ్‌ చేస్తున్నాడు. అతనికి పెళ్లి కూడా అయ్యింది. అయితే రెండో కొడుకు అశోక్‌ (52), మూడో కొడుకు రాజ్‌కుమార్‌ (45), పెద్ద బిడ్డ స్వరూప రాణి (38)కి ఇంకా పెళ్లి కాలేదు. చిన్న బిడ్డ శోభారాణి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోంది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్వీపర్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా, వయసు మీరినా వారికి పెళ్లిళ్లు కాకపోవడం, సంపాదనకు ఏ జాబ్‌ లేకపోవడంతో రెండో కొడుకు అశోక్‌, మూడో కొడుకు రాజ్‌కుమార్‌ మద్యానికి బానిసలయ్యారు. వారితోపాటు వారి సోదరి స్వరూప మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో 3 నెలల క్రితం అనారోగ్యానికి గురైన అశోక్‌ ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చ‌నిపోయాడు.

అయితే.. ఏ సంపాదనా లేని అతని తమ్ముడు రాజ్‌కుమార్‌ అన్న అంత్యక్రియలకు డబ్బులు ఖర్చవుతాయని భయపడ్డాడు. అశోక్‌ మరణ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే అతని శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత సోదరి స్వరూపారాణితో కలిసి ఆ ముక్కలను ఓ గోనె సంచిలో తీసుకెళ్లి లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో పడేశారు. కాగా, గోనె సంచిలో మనిషి అవయవాలు గమనించిన స్థానికులు ఈ విష‌యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాజ్‌కుమార్‌, స్వరూపారాణిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement