Thursday, May 2, 2024

Delhi | ఆస్తుల విభజన కేసులో కౌంటర్లు దాఖలు చేయని కేంద్రం, తెలంగాణ.. మరో 4 వారాలు గడువు పెంచిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో పొందుపర్చిన సంస్థల విభజనపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదులిచ్చేందుకు గడువును మరో 4 వారాలు పొడిగించింది. ఆస్తుల పంపకంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు స్పందించలేదు. శుక్రవారం కేసు విచారణకు రాగా మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరడంతో మరో 4 వారాలు గడువు పెంచేందుకు అంగీకరించింది.

రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా షెడ్యూల్ 9, 10 లలో ఉన్న సుమారు రూ. 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగలేదని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతోందని ఆ రాష్ట్రం పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజనకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్‌లో అభ్యర్థించింది. శుక్రవారం నాటి విచారణలో ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు పరిశీలిస్తామని వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement